వైభవ్ సూర్యవంశీ అనే పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మారుమోగుతోంది. Indian Premier League 2026 సీజన్లో తన విధ్వంసకర బ్యాటింగ్తో ఈ 15 ఏళ్ల యువ ఆటగాడు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. ముఖ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్లో Sunrisers Hyderabad పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.
ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు వైభవ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ Andre Russell సోషల్ మీడియా వేదికగా వైభవ్ను ప్రత్యేకంగా అభినందించాడు.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రస్సెల్ భావోద్వేగ పోస్టు చేస్తూ..
“నువ్వంటే నచ్చనివాళ్లు ఎన్నో విమర్శలు చేస్తారు. నీకు 15 ఏళ్లు కాదని అంటారు. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 30 ఏళ్ల ఆటగాళ్లు కూడా నువ్వు సాధిస్తున్నది చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాగే కొనసాగు. నీ ఆటతీరును చూసి నేను నీకు అభిమానిగా మారిపోయాను. బౌలర్లను కాదు… బంతిని చూడు.. బాదేయ్!”
అంటూ ప్రోత్సహించాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక ఈ సీజన్లో వైభవ్ మరో అరుదైన రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటికే 65 సిక్సర్లు కొట్టి, Chris Gayle 2012లో నెలకొల్పిన 59 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు.
ఆసక్తికరంగా ఈ జాబితాలో Andre Russell కూడా మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 2019 సీజన్లో Kolkata Knight Riders తరఫున 52 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు అదే రికార్డులను వైభవ్ సూర్యవంశీ తుడిచిపెట్టేస్తుండటం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.